Monday 6 February 2012

రెండు న్యాయాలు

నార్వేలో ఒక భారతీయ జంట. వారికిద్దరు పిల్లలు. ఒకరికి మూడేళ్లు. మరొకరికి ఏడాది. ఒక ఉదయాన చైల్డ్ కేర్ ఏజెన్సీ అధికారులు వచ్చి ఇద్దరు పిల్లలను తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేర్ సెంటర్‌లో పెట్టారు. పిల్లలిద్దరిని 18 ఏళ్లవరకూ ప్రభుత్వమే పెంచుతుంది, తల్లిదండ్రుల ప్రమేయం అవసరం లేదు అని తేల్చారు. తల్లిదండ్రులకు సరిగా పెంచడం రాదు కాబట్టి బిడ్డలను తీసుకుపోతున్నట్టు తేల్చారు. ఇంతకీ నార్వే అధికారులు కనుగొన్న నేరాలేమిటి? బిడ్డల డయాపర్స్ మార్చడానికి ప్రత్యేక టేబుల్ ఏర్పాటు చేసుకోలేదు-బెడ్ మీదే మారుస్తున్నారు. వారిని ప్రత్యేక మంచం మీద కాకుండా తమతో పాటే నిద్రపోనిస్తున్నారు. 

తల్లి బిడ్డకు చనుబాలు ఇచ్చేపుడు బిడ్డను పట్టుకునే పద్ధతి సరిగా లేదు. వాళ్లకిచ్చిన ఆటబొమ్మలు చట్టప్రకారం వారి వయసుకు సరిపడేవి కావు. చేతితో తిండి తినిపిస్తున్నారు... ఇవండీ నేరాలు. తిరిగి ఆ బిడ్డలను రప్పించడానికి ఆ తల్లిదండ్రులు భూమ్యాకాశాలు ఏకం చేయాల్సి వచ్చింది. విదేశాంగ మంత్రుల లెవల్లో చర్చలు జరపాల్సి వచ్చింది. అయినా బిడ్డలను తల్లిదండ్రులకివ్వడానికి ఒప్పుకోలేదు. అంకుల్‌కి ఇవ్వబోతున్నారు. నవ్వూ కోపం అన్నీ కలగలిసి వస్తున్నాయి కదా! తెల్లతోలు అహంకారం, సాంస్కృతిక దురహంకారం అని తెగతిట్టిపోయాలని అనిపిస్తుందికదా! 

తప్పులేదు. కానీ అదే సమయంలో మరో కోణం కూడా ఆలోచించాలి. ఒక పసిప్రాణానికి ఆ దేశం ఇచ్చే స్థానం గురించి బిడ్డ మానసిక శారీరక ఎదుగుదల గురించి ఆ దేశానికి ఉన్న శ్రద్ధ గురించి ఆలోచించాలి. ఆ తల్లిదండ్రులు దేశ ప్రమాణాలకు భిన్నంగా బిడ్డలను పెంచుతున్నారని అనుకున్నాక ఆ ఇంటిమీద చాలా కాలం నిఘా పెట్టారు. పరిశోధన జరిపి మరీ ఈ విడ్డూరమనిపించే నేరాల చిట్టా బయటకు తీశారు. ప్రతి మనిషి మీద అంత శ్రద్ధ పెట్టగలిగిన వ్యవస్థ, బిడ్డలను అంత శ్రద్ధగా వారి ప్రమాణాల మేరకు ప్రభుత్వమే పెంచగలిగిన వ్యవస్థ అక్కడ ఉన్నది. అంత సంపద కూడా ఉన్నది. 

అది మానవాభివృద్ధి సూచిలో ప్రధమ స్థానంలో ఉన్న దేశం. అదే సమయంలో భారత్‌లో ఏం జరిగింది? ఒక విదేశీ జంట. సరోగసీ ద్వారా బిడ్డను పొందింది. తల్లి అమెరికన్. తండ్రి జమైకన్. వారి సంతానం హైదరాబాద్‌లోని ఒక తల్లి గర్భంలో పెరిగింది. బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను ఆ తల్లిదండ్రులు అమెరికా తీసికెళ్లాలి. పాస్‌పోర్ట్ ఆఫీస్ దగ్గర చిక్కొచ్చింది. మూడు జాతీయతలతో ముడిపడిన ఆ బిడ్డను ఏ జాతీయుడిగా గుర్తించాలనేది సమస్య. ఢిల్లీతోనూ వాషింగ్టన్‌తోనూ చర్చోపచర్చలు జరిపారు కానీ విషయం తెగలేదు. ముడిపడలేదు. ఈ లోపు ఆ అమెరికన్ అమ్మవారికి కోపమొచ్చింది. ఇంత ఆలస్యం చేస్తారా.. అనేసి బిడ్డను అక్కడ వదిలేసి వెళ్లిపోయింది. 

మీ ఇష్టం మీరేం చేసుకుంటారో చేసుకోండి అనేది నిరసన. తర్వాత అధికారులే తలపట్టుకుని ఆమె ఎక్కడుంటే అక్కడికెళ్లి బతిమిలాడి బామాలి పిలుచుకొచ్చి బిడ్డను అప్పగించారు. అయినా మన పాలనాయంత్రాంగానికి కోపం రాదు. బిడ్డ ఏమైనా స్కాచ్ బాటిలా అ«ధికారులు అభ్యంతరం చెపితే అలా వదిలేసిపోవడానికి! ఆ అమెరికన్ మహిళ చేసింది నేరంలా కనిపించకపోవడంలో పనిచేసిన అంశమేమిటి? ఎందుకు కేసు పెట్టలేదు? ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలేదు? కనీస లీగల్ ఫ్రేమ్ వర్క్ తయారు చేయకుండానే ఆటోల మీద పోస్టర్లు వేసి మరీ ప్రచారం చేసుకునేంతగా గర్భాల వ్యాపారాన్ని అనుమతించిన వారినేమనాలి? ఇక్కడే ఉంది అసలు విషయం. 

ఒక దేశంలో బిడ్డను తమ దేశప్రమాణాల ప్రకారం పెంచడం లేదని పిల్లల పెంపకం బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుంది. అవెంత విపరీతమైన ప్రమాణాలు అయినప్పటికీ. ఇంకో దేశంలో బిడ్డను అలా ఆఫీసులోనే విసిరేసిపోయినా మనకు చీమకుట్టినట్టయినా ఉండదు. పసిబిడ్డల గురించి ఉన్న శ్రద్ధలోనూ వ్యవస్థలోనూ తేడాలు అలాంటివి. మన దేశంలో ప్రాణాలకు ఉన్న విలువ అలాంటిది. 

ఇక్కడ బిడ్డలను ఆస్పత్రుల నుంచి ఎవరో ఎత్తుకుపోతుంటారు. పసిప్రాణాలను కుక్కలు, పందులు పీక్కుతింటుంటాయి. కుహనా విలువల వల్ల మన సొసైటీలో తిష్టవేసుకుపోయిన హిప్పోక్రసీ వల్ల పసిబిడ్డలు కుప్పతొట్లలో, ముళ్లకంపల్లో ప్రత్యక్షమవుతుంటారు. మనకేమీ కోపంగా అనిపించదు. పేదలు, పేద పిల్లలు ఎలా చచ్చినా ఏమీ అనిపించనంత ఇమ్యూన్ అయిపోయాం. 

వందకోట్ల పైచిలుకు దేశం కదా, మనుషులు దోమల్లా చీమల్లా రాలిపోవడం ఆనవాయితీగా మారింది. కళ్లముందే ఆకలిచావులు కనిపిస్తున్నా అగ్రరాజ్యం హోదా కోసం అర్రులుచాచగల దుస్సాహసికులం కదా, అందువల్ల మనకు ఒక బిడ్డను అలా ఆఫీసులో విసిరేసిపోయినా ఆ మహిళ నేరపూరిత నిర్లక్ష్యంపై రావాల్సినంత కోపం రాదు. పైగా అమెరికన్ మహిళ. కేసు పెట్టే సాహసం అస్సలు చేయలేం. భయం, బానిస మనస్తత్వం. 

అవుట్‌సోర్సింగ్ అలవాటైపోయింది మనకు. ఇతరత్రా సేవలయిపోయాయి. ఇపుడు గర్భసేవల శకం. ఇక్కడి పేదతల్లులకు కొన్ని వేలు పడేస్తే ఏదేశపు వారి వీర్యానికో రూపమిచ్చి కడుపులో తొమ్మిది నెలలు మోసి కని ఇచ్చేయగలరు. చీప్ లేబర్. కానీ ఇందులోని లేబర్ చీప్ కాదు. లేబర్ పెయిన్స్ అంటే చచ్చిబతకడమే. అంతేనా! అద్దెగర్భాన్ని కాపాడుకోవడానికి అవసరమైన డ్రగ్స్, ఒత్తిడి, సైడ్ అఫెక్ట్స్ అన్నీ భరించాలి. పేదరికం మహాచెడ్డది. నార్వేను తెగడడంలో ఉన్నంత ఆవేశం ఇక్కడ అమెరికన్‌ను తెగడడంలో చూపించరు. 

ఎందుకంటే అది అమెరికా. సమస్య తెల్లతోలు-నల్లతోలు కాదు. మన దగ్గర బలిసినోళ్లు తాగి తందనాలాడి కేళీ విలాసాల్లో మునిగితేలడానికి ఉజ్జెకిస్తాన్, తజకిస్తాన్, తుర్కెమెనిస్తాన్ లాంటి దేశాలనుంచి తెల్లతోలు అమ్మాయిలను దిగుమతి చేసుకుంటారు. ఢిల్లీలోనూ హైదరాబాద్‌లోనూ ఏ హైక్లాస్ ప్రాస్టిట్యూషన్ ప్లేస్‌లో చూసినా వాళ్లే. అసలు సమస్య పేదరికం. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యాక ప్రపంచానికి సెక్స్ వర్కర్లను సప్లయ్ చేసే సెంటర్‌గా మారిపోయింది. డబ్బు అధికారం ఉన్న తెల్లతోలు పట్ల మన పర్సెప్షన్ వేరు. 

అది లేని చోట్ల మన పర్సెప్షన్ వేరు. వర్వర్షన్స్ వేరు. ప్రపంచంలోని ధనిక తెల్ల దేశాలు భారత్‌లో అద్దెగర్భాలు చీప్‌గా దొరుకును అని కనుగొన్న తరుణంలోనే ఇక్కడి విలాసపురుషులు వేరే తెల్లదేశాల నుంచి సెక్స్ వర్కర్లను దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండడం ఈ దేశ వ్యవస్థలోనూ సంపద పంపిణీ లో నూ ఎంత దుర్మార్గం ఉందో తెలియజేస్తుంది. ఇంతకీ నార్వే ఘటన హైదరాబాద్ ఘటన చూశాకైనా అగ్రరాజ్య హోదా గురించి మాట్లాడడం మానేస్తారని ఆశించగలమా! అనవసరమైన డాంబికాలు మానే సి కనీస మానవీయ విలువలున్న వ్యవస్థ కోసం ప్రయత్నించగలమా! 

- జి.ఎస్.రామ్మోహన్
(2012 జనవరి 28న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వ్యాసం)

No comments:

Post a Comment