Monday 24 October 2011


టీ వీ భాష-కొన్ని విషయాలు

టీవీల్లో వాడే భాష తెలుగులాగా లేదని, ఈ సంకరతనం చూడలేక చస్తున్నామని చాలామంది భాషాభిమానులు ఆక్రోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, మ్యూజిక్ చాన ళ్ళ సంగతి సరే, న్యూస్ చానళ్లలో కూడానా అని ఆవేదన. ఈ ఆవేదన సమంజసమైనది. కాకపోతే చాలామంది పెద్దమనుషు లు దీని వెనుక చూస్తున్న కారణాలు పాక్షికమైనవి.

ప్రత్యేకించి టీవీ జర్నలిస్టులకు, యాంకర్లకు శిక్షణ సరిగా లేకపోవడమే ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఇవాళ ప్రింట్ అయినా టీ వీ అయినా శిక్షణ లోపం అన్నింట్లోనూ ఉంది. కాకపోతే న్యూస్ చానళ్ళు ఒక్కసారిగా తోసుకుని రావడం వల్ల లోపం ఓ తులం ఎక్కువ ఉండొచ్చు. అది జనరల్ అంశం. టీవీల స్వభావంతోనే ముడిపడిన నిర్దిష్టమైన కారణాలు వేరే ఉన్నాయి.

న్యూస్ చాన ళ్ళు ప్రధానంగా అర్బన్ ఆడియెన్స్‌ను దృష్టిలో ఉంచుకుని సాఫ్ట్‌వేర్ రూపొందించుకుంటాయి. ఎందుకంటే ఆడి యెన్స్‌ని కొలిచే టామ్ వ్యవస్థ పట్టణాలకే పరిమితం. యాడ్స్ అన్నీ పట్టణ విద్యావంతులైన యువత మీదే ఆధారపడి ఉంటాయి. పట్టణ పరిభాషకు సంబం«ధించి, ఆంగ్ల వాడకానికి సంబం«ధించి మనకున్న అవగాహన, అందులోని లోటుపాట్లు అన్నీ టీవీల్లో ప్రతిఫలిస్తాయి.

వాస్తవానికి అన్యదేశ్యాల వాడకం కంటే తీవ్రమైన సమస్యలున్నాయి. ఇరవై ఏళ్ళలో వచ్చిన సామాజిక పరిణామా ల వల్ల ఇపుడు కాలేజీల నుంచి జర్నలిజంలోకి వస్తున్న వారిలో ఎక్కువ మందికి సమాజం గురించిన అవగాహన, పట్టింపు అంతకుముందు తరాలతో పోలిస్తే తక్కువ. ఇది అండర్‌స్టేట్‌మెంట్. ఒకచోట 160 మంది విద్యార్ధులను ఇంటర్య్వూ చేస్తే నలుగురు మాత్రమే శ్రీశ్రీ, చలం పేర్లు విన్నారని తేలింది.

ఈ విషాదంలోకి వెడితే బయటకు రాలేం. తాము చదివే వార్తలకు చాలామంది న్యూస్ రీడర్లకు ఉన్న బంధం పరాయిది. నిజ జీవితంలో ఎన్నడూ రాని పాజింగ్ సమస్య వార్తలు చదివేప్పుడే ఎందుకు వస్తుంది? విషయమూ, వాక్యమూ బయటివి కాబట్టి. అవగాహన, ఉచ్ఛారణ, పదాల పొందిక-విరుపు, వాడే పదజాలం మీడియా భాషకు సంబంధించిన ముఖ్యమైన విషయా లు.

అవగాహన గురించి ఇప్పటికే చెప్పుకున్నాం. మిగిలిన విషయాలను చూద్దాం. స్క్రీన్ మీద కనిపించే వారిని కూడా పట్టణాల నుంచే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఉచ్చారణ వ్యవహారంలో భాగంగా వస్తే సహజంగా ఉంటుంది. కానీ పట్టణాల్లోని చదువుల వల్ల తెలుగును పిల్లలు నేర్చుకోవాల్సి వస్తున్నది. లిపి నుంచి నేర్చుకున్న తెలుగు వ్యవహారంలో భాగంగా ఒంటబట్టే తెలుగంత సహజంగా ఉండదు.

ఎందుకంటే ఉచ్చారణ ప్రాధమికం. లిపి ద్వితీయం. కొంతమంది వ్యవహారంలోనే నేర్చుకున్నా పలుకుబడులు, జాతీయాలు, సామెతలతో సంప ర్కం తక్కువ. చందమామ, బాలమిత్రల మీదుగా నడిచొచ్చిన బాల్యానికి ట్వింకిల్ ట్వింకిల్ మీదుగా నడిచొచ్చిన బాల్యానికి తేడా ఉంటుంది. ఒక్కముక్కలో న్యూస్ రీడర్లు మాట్లాడే తెలు గు మీద అర్బన్ సమాజంలో ఆధిపత్యంలో ఉన్న సంస్కృతి ప్రభావం ఉంటుంది. ఒక రకమైన వింత ఉచ్చారణతో మాట్లాడడం స్టెయిల్ అనే పేరుతో నగరాల్లో చెలామణిలో ఉంది.

చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. తెలుగు సినిమాల్లో హీరోయిన్ల భాష చూడండి. తెలుగేనా అంటే తెలుగే. కానీ తెలుగులాగా వినిపించదు. సూర్యకాంతం తెలుగును, త్రిషకు చెప్పే డబ్బింగ్ తెలుగును పక్కపక్కన వింటే తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఆశాభోంస్లేను గాయనిగా తప్పు పట్టగలమా! మరి ఆమె అడుగులు నేర్పావు అని-పావుశేరులో పాను పాడేసింది. తప్పుఆమెది అన లేం.

అసలే ''నువ్వంటే పాడిపాడి చస్తానే'' అని స్టెయిలిష్‌గా 'వరవషం'తో హమ్ చేసుకుంటున్న కాలం. సినిమా మార్కెట్ ఆ విధంగా అలోచిస్తోంది. ''యాతమేసి తోడినా ఏరు ఎండదు - "పొగిలిపొగిలి ఏడ్చినా పొంత నిండదు'', "సడిసేయకే గాలి'' లాంటి పాటలకు ఇపుడైతే ప్రతిపదార్ధ, తాత్పర్యమివ్వాల్సి ఉంటుంది. కచ్చతనంతో ఈ పనిచేశాడు.. లో చ్చను పచ్చదనంతో పరవశిస్తోందిలోని చ్చను ఒకేరకంగానే పలుకుతారు కొంతమంది . వెనక్కు లాగాడులో గా ను రాగాలు తీశాడులో గా ను ఒకే రకంగా పలుకుతారు.

జానెడు పొట్ట, జారుడు బల్లల్లో ఒకటే జ. చవితి చంద్రుడొచ్చాడంటే చచ్చారే. ఒక్కటే చ. ఱ లాగే మూడో చ, మూడో జ కూడా అంతరించి పోతున్న జాతుల్లో చేరే ప్రమాదం కనిపిస్తోంది. అది సహజమైన మార్పు అయితే ఆహ్వానించొచ్చు. ఈ మార్పు కృత్రిమమైనది. కింది నుంచి వచ్చిన మార్పు కాదు. పైనుంచి రుద్దుతున్నది. రాసారు చేసారు శబ్దాలు సాధారణమై పోయాయి.

తల్లనకా-పిల్లనకా రెంటిలో రెండో అక్షరం శబ్దం ఒకటే. సర్వ శబ్ద సమానత్వం! పైడి తల్లమ్మకూ ఈ తిప్పలు తప్పవు. పుల్లమ్మలో ల్ల శబ్దంతో ఆమెకు జాతర చేస్తారు. చెప్పారు కు అప్పారావుకు తేడా ఉండ దు. కొట్టాడు - పట్టాలు, తన్నాడు - చిన్నారావు సేమ్ టు సేమ్. ఒక్క 'ఎఇ' శబ్దాలకే పరిమితమైన సమస్య కాదు. మౌలికంగానే ఈ ఉచ్చారణ పద్ధతి వేరు. ఇది వ్యక్తుల సమస్య కూడా కాదు.

టీవీల్లో ఆన్‌స్క్రీన్‌కి మార్కెట్ నిర్దేశించిన అర్హతల్లో తెలుగుదనం ప్రధానమైనది కాదు. ఉచ్చారణకు లిపికి సంబంధించి వర్తమాన అవగాహనకు అద్దంపట్టే ఉదాహరణ టీవీలతో పాటు పుట్టుకొచ్చిన ఒక ఆంగ్ల పదం వాల్డ్. వరల్డ్ కొచ్చిన తిప్పలు. వరల్డ్ రాస్తే ఆర్ సైలెంట్ చేయకుండా (అది సైలెంట్ చేయకపోతే స్టెయిల్‌గా ఉండదని భయం) అలాగే చదివేస్తారనే భయంతో పదాన్నే మార్చేసి మన వార్తా రచయితలు ఈ కొత్త పదాన్ని సృష్టించారు. అదియందు శబ్దముండెను అని ఆధ్యాత్మికంగా నమ్మేవారు సైతం సాంస్కృతిక వ్యవహారాల దగ్గరికొచ్చేసరికి ఆదియందు వాక్యముండెను పద్ధతి పాటిస్తారు. ఇదో వైరుధ్యం.

నిరుడు అనే పదం 'ఆడ్‌గా' అనిపించి గతేడాది అనే దిక్కుమాలిన పదం ప్రమాణమై కూర్చుంటుంది. శక్తిలోపం కంటే అవగాహన లోపం వల్ల ఏర్పడే ప్రమాదం ఎక్కువ కాబ ట్టి దీని గురించి ఇంతగా చెప్పుకోవాల్సి వస్తున్నది. ఇక తత్సమాలు, తద్భవాల చర్చలోకి అడుగుపెట్టే పరిస్థితే లేదు. టీవీ చానళ్లలో కూడా ముఖయంత్రము, కరణము అని బొమ్మలు అవీ వేసి నాలుక ఎక్కడ తగిలితే ఏ శబ్దం వస్తుంది అని వివరించాలనే తపన ఉన్నవారుంటారు.

ఓష్ఠ్యాలు, దంత్యాలు, అనునాసికాలు అని ఏమోమో నూరిపోయాలనుకునే వారుంటారు. కానీ అది మార్కెట్ అవసరం కాదు. ఇదంతా ఎందుకంటే సినిమాల్లోనయినా టీవీల్లోనయినా తెలుగును తెలుగులాగా పలకడం అనేది ప్రమాణం కాదు. మార్కెట్ అవసరం కూడా కాదు. పట్టణాల్లో ఈ కొత్త తెలుగుకు ఆమోదం వస్తున్నది. పై తరగతి అలవాట్లను కింది తరగతి అనుసరిస్తుంది కాబట్టి ఇది ప్రమాణంగా కూడా మారుతున్నది.

టీవీలో పనిచేసే జర్నలిస్టులనో, యాంకర్లనో మరొకరినో తప్పుపట్టాల్సిన పనిలేదు. మార్కెట్ శాసిస్తుంది. భాష పాటిస్తుంది. ఏ వ్యవస్థ అయినా దాని అవసరానికి తగినట్టే తనను తాను తీర్చుదిద్దుకుంటుంది. మార్కెట్ ముందు సెంటిమెంట్లు, విలువల భాషణలు పనిచేయవు.

తెలుగు అజంతమూ, ఎల్లోరానా అని హనుమాన్ చాలీ సా పఠించడం వల్ల లాభం ఉండదు. మనం ఎడిటర్లకు మహాజర్లు అవీ సమర్పించడం వల్ల మహా అయితే పైపై మార్పులు సాధించగలమేమో (అది కూడా ఆ ఎడిటర్ భాషాభిమాని అయి ఉంటే). ఇవాళ సమాజంలో ఎదగడానికి తెలుగు అవస రం అంతగా లేదు. చదువుల్లో ఉద్యోగాల్లో అది ప్రతిఫలిస్తున్న ది. అక్కడ మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలి. అది కొంచెం పెద్ద విషయమే. పెద్ద విషయాలు పరిష్కారం కావాలంటే పెద్ద ప్రయత్నాలే జరగాలి.

-జి.ఎస్.రామ్మోహన్
(2010 నవంబర్‌ 11న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వ్యాసం)

Thursday 20 October 2011

కొన్ని తెలుగు బూతులు-ఒక పరిశీలన




రోజూ సోనా మసూరి తినేవాళ్లు నెలకోమారు రాగిసంగటి తినాలనుకోవచ్చు.  ఇన్నాళ్లూ సంగటితో బతికిన వాళ్లు సోనామసూరి తినాలని ఆశపడొచ్చు. ఒకటి సరదా....తలకాయ కూరతోనో పల్లీల చట్నీతోనో భేషుగ్గా అనిపించే జిహ్వ చాపల్యం. ఒక్క ముక్కలో ఫాన్సీ. ఇంకొకటి...అన్నిమాటల్లేవు. ఒకటేమాట. జీవితం. మేం ఇంత కష్టపడి సూపర్‌మార్కెట్‌లో రాగిపిండి కొనుక్కుని  ముచ్చట పడి మరీ  సంగటి తింటుంటే మీరా అనారోగ్యకారకమైన సోనా మసూరికోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారని ఫాన్సీగాడు జీవితంగాడికి బోధిస్తే ఏమంటాం? దీన్ని అచ్చతెలుగులో బూతు అంటారు. మరి, ఇంగ్లిష్ రెక్కలు తొడుక్కుని అమెరికాకు ఎగిరిపోయిన వారు ఇక్కడి తెలుగు వాళ్లకు మాతృభాష గురించి పాఠాలు చెప్పడాన్ని ఏమనాలి? అదీ ఇసయం! ఈ మద్దెన తానా తందానా..ఆటా పాటా, సిలికానాంధ్ర-సెలైనాంధ్ర ఏది చూసినా తెలుగు ముచ్చట్లే. మాంచిగా పట్టు ధోవతులు, పట్టు పరికిణీలు కట్టి మరీ తెలుగుదేశంలో తెలుగేమైపోతున్నది అని బాధపడుతున్నారు. ఖండాంతరాలు దాటి ఇంత దూరం వచ్చినా తాము ఇంతగా మాతృభాష కోసం ప్రాకులాడుతుంటే తెలుగుదేశంలో ఉండి తెలుగును మర్చిపోతారా అని ఆవేశం, ఆవేదన, ఆక్రోశం ఇత్యాది అకారాదిభావాలనేకం  గొంతులోనూ ముఖంలోనూ పలికిస్తున్నారు. ఈ ఇంగ్లిష్‌ వ్యామోహమేమిటి? అని నిగ్గదీసి నిలదీసేస్తున్నారు. గుడ్డు..వెరీ గుడ్డు..వెరీ వెరీ గుడ్డు. నాలుగింగిలిపీసు ముక్కలు నేర్చుకుంటే మెరుగైన అన్నం తినొచ్చని మెరుగైన బండిలో తిరగొచ్చని మెరుగైన దేశంలో ఉండొచ్చని ఇంకా ఇలాంటి మెరుగుల కోసమే కదా దొరలూ మీరు సముద్రం దాటేసింది. మరి ఆ మెరుగులు మాకొద్దా! మీకు అవసరమైపోయింది మా దగ్గరికొచ్చేసరికి పనికిమాలినదైపోయిందా సార్లూ! ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ అని మీరు పాడితే కర్ణపేయంగానూ మేం పాడితే కర్ణ కఠోరంగానూ ఉంటుందా దొరలూ? మంచి ఎవరు చెప్పినా మంచే కదా...మెరుగైన జీవితం కోసమని మన మాతృభాషను కించపరిచే ధోరణులు తగునా..ఇపుడు నడుస్తున్న పోకడలు సమంజసమైనవా అని పెద్దలు గంభీర్‌కే రూప్‌మే ప్రశ్నించవచ్చును. లెస్సయిన ప్రశ్నలే. కానీ మంచి చెడులు సైతం స్థలకాలాతీతములు కాలేవు. ఆంగ్లంలోనే అన్నీ ఉన్నాయిష అనేవాడిని సిగపాయ తీసి తందుమా లేదా అనేది మనం మనం తేల్చుకుందాం. మన తిప్పలేవో మనం పడదాం. కానీ వలసపక్షులకు దారిచూపిన వారు ఇంగ్లిష్‌ వ్యామోహం ఇంతగా పెరిగిపోవడానికి ఉత్ప్రేరకులైన వారు మనకు ఉల్టా నీతులు చెపితే మాత్రం ఎక్కడో కాలుద్ది. కాలకపోతే మనలో ఏదో లోపమున్నట్టే లెక్క. నాలుగు డబ్బులున్నోడు ఏం కూసినా ఎగబడి చూసే రోగం ధనమంత పురాతనమైనది. వారసత్వ సామాజిక వ్యాధియని చరిత్ర చెప్పుచున్నది.  చెప్పువాడు కుబేరుడైతే ఎగబడి చూచువాడిని తెలుగులో బానిస అంటారు. దూరం పోయినంత మాత్రాన మాతృభాషమీద ప్రేమ యుండకూడదా? ఉండవచ్చును.  దూరమైన దానిపట్ల ప్రేమ ఎక్కువగానే యుండవచ్చును. ముగ్గులు, పిడకలు, కీర్తనలు, గొబ్బెమ్మలు, ఇత్యాది దినుసులతో తెలుగు సంస్కృతిని కాపాడుకుంటున్నామనుకోవచ్చును. సాఫ్టువేరులు, హర్డువేరులు రూపొందించవచ్చును. సంతోషం. సంవ్సతరానికి ఒకసారి ఆ ప్రేమను చాటుకోవడానికి పంచెలు, ఓణీలతో ఉత్సవాలు చేసుకోవచ్చును. తెలుగుదేశం నుంచి సినిమా బాబుగార్లను హిందీ తారలను పిలిపించుకుని డాన్సులవీ వేసి ముచ్చట తీర్చుకోవచ్చును. ఆ పక్కనే ఏ శోభారాజ్‌నో పిలిపించుకుని అన్నమయ్య కీర్తనలూ పాడించుకోవచ్చును. తప్పులేదు. ఇంగ్లిష్‌ జీవితంలో ఉన్నవారు ఒకరోజు తెలుగు ఉత్సవం చేసుకుంటే ఎందుకు తప్పు పడతాం! కానీ తెలుగు జీవితంలో ఉన్నవారికి తెలుగు పాఠాలు చెప్పే దుస్సాహసానికి పాల్పడితే మాత్రం బాగోదు. ఇపుడూ, నువ్వు పట్నవాసపు ఏసిరూముల్లో బతుకుతూ పల్లెల్లో నక్షత్రాలు, వెన్నెల ఎంతబాగుంటాయో అని వగచవచ్చు. పెరట్లో కొబ్బరాకుల మాటున చంద్రున్ని చూస్తూ నులకమంచంపై పడుకోవండలో ఉన్న ఆనందం గురించి కూడా సినిమా లెవల్లో కబుర్లాడుకోవచ్చు. ఎన్నైనా అనుకోవచ్చు. మనకు దక్కని వెన్నెలతో మంచిగాలితో పల్లెజనం ఎంత సుఖపడిపోతున్నారో అని బాధపడిపోవచ్చు. తప్పేమీ లేదు. కానీ మేం వెన్నెల గురించి ఆలోచిస్తుంటే మీరు ఫ్యాన్లు, ఎసిల కోసం పాకులాడడమేమిట్రా అని వారికి పాఠాలు మాత్రం చెప్పరాదు. మిక్సీలు, గ్రైండర్ల కంటే రోటి పచ్చడి బెటరని నువ్వనుకోవచ్చు. అందుకు పెళ్లాలను రాచిరంపాన పెట్టొచ్చు. కానీ మేమే రోటి పచ్చళ్లవైపు చూస్తుంటే నువ్వు మిక్సీలు కొంటున్నావేంట్రా సుబ్బాయ్‌ అని సుమతి అవతారమెత్తకూడదు. నువ్వు ఇంటిపక్కనే ఉన్న సూపర్‌ మార్కెట్‌కు  కూడా బైకో కారో వేసుకుని వెళ్లవచ్చు. కానీ  "అప్పట్లో కాలేజీకి ఐదారుకిలోమీటర్లు నడిచిపోయేవాళ్లం..ఇపుడు కిలోమీటర్‌ నడిచేవాడు లేడు. అన్నింటికీ ఆటోనో బస్సో కావాల్సిందే..పల్లెలు కూడా సోమరితనం నేర్చుకున్నాయి..ప్చ్‌ పాడైపోయాయి..." అనకూడదు.  ఆదిలోనే చెప్పుకున్నట్టు దాన్ని బూతు అంటారు. కొన్ని ప్రాంతాల్లో బలుపు అని కూడా వ్యవహరించడం కద్దు. తన్నుమాలిన దర్మసూత్రములు వల్లించువారిని నోటికి చేతికి పొంతనలేని వారిని అలా వ్యవహరించడమే మర్యాద, పద్ధతీను. మన తెల్లదొరలు అతీతులేమీ కాదు. కనీసం వెస్ట్రన్ లెక్కల్లో అయినా యు ఓకే..ఐ ఓకే అనన్నా అనుకోవాలి. ఐ ఓకే..యు నాట్‌ అంటే ఏమనాలి? అహా! ఏమనాలి అంట! ఏమంటాం? ఇంగ్లిష్‌ దేశంలో ఉన్నారు కదా!..ఏసు క్రీస్తు మాటలనే చెప్పుకుందాం. అయ్యలారా!..అమ్మలారా! మాకోసం ఏడవకండి..మీ కోసం..మీ పిల్లల కోసం ఏడవండి..ఆమెన్‌!
                                                                                                                                     జి ఎస్‌ రామ్మోహన్‌


                                                                                                               

రెండు దశాబ్దాలు-అనేక కుదుపులు


పివి నరసింహారావు సూత్రధారిగా మన్మోహన్‌ సింగ్‌ పాత్రధారిగా ఆరంభమైన కొత్త ఆర్థిక విధానాలకు ఇరవై యేళ్లు. చరిత్రాత్మకం అని చాలామంది చెప్పుకునే నాటి మన్మోహన్‌ బడ్జెట్‌కు 20 యేళ్లు. ఈ రెండు దశాబ్దాలు స్వతంత్రభారత చరిత్రలో ప్రత్యేకమైనవి. దేశపు దిశ దశ మార్చేసినవి. ఇది పారాడిమ్‌ చేంజ్‌  అనేది అందరూ ఒప్పుకునే మాటే. కాకపోతే గుణదోషాలకు సంబంధించి ఎవరి భాష్యం వారు చెప్పుకోవచ్చు. పెరిగిన పట్నాల గురించి తరిగిన పల్లెల గురించి, ఆదాయంతో పాటుగా పెరిగిన అంతరాల గురించి మాట్లాడుకోవచ్చు. అంత గంభీరమైన విషయాల జోలికి పోకుండా మనకు కొట్టొచ్చినట్టు కనిపించే చిన్నచిన్న విషయాల గురించి కూడా మాట్లాడుకోవచ్చు. ఈ 20 యేళ్లలో కొన్ని కొత్త పదాలుపుట్టుకొచ్చాయి. కొన్నిపదాలకు కొత్త అర్థాలు పుట్టుకొచ్చాయి. అసలు ఆ రోజు బడ్జెట్‌ వచ్చీ రావడమే సరళీకరణ అనే  పదాన్ని మోసుకొచ్చింది. మామూలుగా సరళీకరణ అంటే ఉండే అర్థం వేరు. కానీ ఏం జరిగింది? ప్రభుత్వ రంగంలోని సంస్థలను ప్రైవేట్‌ పరం చేసే ప్రక్రియగా మార్చేశారు. సరుకు ఏదైనా ఎలా ఉన్నా పాకేజింగ్‌‌ మాత్రం అందంగా ఉండాలి అనే భావనకు ఇది సంకేతం. సారం కంటే రూపం ప్రధానమైపోయిన దశకు సంకేతం. రేట్లు పెంచాం అనరు. హేతుబద్ధీకరించాం అంటారు. ఈ ఒరవడిని అన్ని రంగాలు అందిపుచ్చుకున్నాయి.  బ్రిటీషర్లు లిఫ్ట్‌ అంటే అమెరికన్లు ఎలివేటర్‌ అంటారు చూశారూ అలా మార్కెట్‌ పాత పదాలకు సొంత అర్థాల్ని ఇచ్చుకోవడమే కాకుండా ప్రత్యామ్నాయ పదాల్ని కూడా సృష్టించుకుంది. ఇరవై యేళ్లక్రితం ఆరోగ్యంగా ఉండాలి అనేవారు. ఇపుడు ఫిట్‌నెస్‌తో ఉండాలి అంటున్నారు. అప్పట్లో క్లబ్‌ సాంగ్స్‌ అనేవారు. క్లబ్‌ డాన్సర్లనేవారు. ఇపుడు ఐటెమ్‌ సాంగ్స్‌ ఐటెమ్‌ గర్ల్స్‌ అంటున్నారు. జ్వోతిలక్ష్మీ, జయమాలిని, అనూరాధల కంటే ఒక అంగుళం ఎక్కువే బొడ్డుకింద, మెడకింద దిగేయడానికి హీరోయిన్లబడే వారే సిద్ధమవడంతో క్లబ్‌డాన్సర్లనే జాతి అంతరించింది. ఇరవై యేళ్లక్రితం సీరియల్‌ రచయితల హవా నడిచేది. మేగజైన్లు బాగా నడిచేవి. 90ల్లో టీవీలు మన నట్టింట్లోకి వచ్చాక వాటి గ్లామర్‌ తగ్గింది. సీరియళ్ల రచయితల్లో చాలామంది రూట్‌ మార్చి వ్యక్తిత్వ వికాసకులు అయిపోయారు. టేబుళ్లమీద చేతి రుమాలు ఎలా మడిచి పెట్టుకోవాలి. సూప్‌ ఒళ్లో పడకుండా ఎలా తాగాలి, ఇంటర్యూలో ఎలా కూర్చోవాలి లాంటి ఎటికెట్ కూడా పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ అయిపోయింది. స్పోకెన్‌ ఇంగ్లీష్‌ పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ జంటపదాలయి పోయాయి. 
              క్షౌరశాలలు అప్పటికే సెలూన్‌లుగా మారుతున్నాయి. అవి ఆ తర్వాత బ్యూటీ పార్లర్స్‌గా బ్యూటీస్టుడియోలుగా స్పాలుగా మారిపోయాయి. దర్జీ షాపులు బొతిక్‌లుగా రూపాంతరం చెందాయి. అంతకు ముందు బిజినెస్‌ వార్తలు లోపలిపేజీల్లో కనిపించేవి. ఇపుడు అవి పతాకశీర్షికలుగా మారిపోయాయి. మీడియాలో లైఫ్‌ స్టెయిల్‌ జర్నలిజం అనే పదం వచ్చి చేరడమే కాదు, ప్రధానమైన విభాగంగా మారిపోయింది. బార్లు ఆమ్‌ఆద్మీకి మిగిలిపోయి పబ్బులు హైక్లాస్‌ సెంటర్లుగా రూపాంతరం చెందాయి. అంటే అప్పర్‌క్లాస్‌, హయ్యర్‌ మిడిల్‌క్లాస్‌ ఈజీగా గుర్తించేట్టుగా ఇవి మీవి అని వారికి సులభంగా చెప్పగలిగేలా అన్ని విభాగాలూ కొత్త పరిభాషను సృష్టించుకున్నాయి. ఇరవై యేళ్ల క్రితం ఇండస్ర్టియలిస్టులు రాజకీయ నాయకులకు నిధులిచ్చి తమ పనులు చక్కబెట్టుకునే వారుగా మాత్రమే ఉండేవారు. ఈ 20 యేళ్లలో వచ్చిన పరిణామాలు తెర వెనుక ఉన్న వాళ్లను తెరమీదకు తెచ్చాయి. రాజకీయం అతి పెద్ద వ్యాపారంగా మారింది. మధ్యతరగతి అవినీతికి అవకాశాలు తగ్గిపోయి ఎక్కువ సమానుల పాత్రను కోల్పోయారు. అవినీతి తప్పుడు పని అని ఇప్పుడే కనిపెట్టేశారు. అంతా ఇపుడు రూల్‌ ఆఫ్‌ లా గురించి వాదిస్తున్నారు.
          ఇవి కాకుండా ఈ 20 యేళ్లలో ప్రధానమైన పరిణామం ఎక్స్‌క్లూజివ్‌ విధానాలు. విద్య, వైద్యం, ఆధ్యాత్మికం, రిక్రిషియేషన్‌ అన్ని రంగాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఏ క్లాస్‌కు ఆ క్లాస్‌ స్కూల్స్‌, ఆస్పత్రులు, సినిమా హాళ్లు, దేవాలయాలు కూడా ఏర్పడ్డాయి. పూనకం అనారగికమైపోయి ధ్యాన మార్గంలో సూక్ష్మ శరీరంతో దేహం వీడి ఎక్కడికో వెళ్లి రావడం లాంటి మాటలు ఆధునికమైపోయాయి. మామూలు సినిమాహాళ్లలో అలగా జనంతో పాటు వెళ్లి చూసే బాధ తప్పించుకోవడానికి ఉన్నత తరగతి మల్లీఫ్లెక్స్‌లను సృష్టించుకుంది. మల్టీప్లెక్స్‌ థియేటర్ల రాకతో దానికి అవసరమైన న్యూ జనరేషన్‌ సినిమాలు దర్శకులు వచ్చి చేరారు. దానికి సెన్సిబిలిటీ అనే అందమైన పదాన్ని ఆపాదించేసుకున్నారు. శేఖర్‌ కమ్ములలు, దేవ్‌ కట్టాలు, జాగర్లమూడి క్రిష్‌లు ఈ మల్లీఫ్లెక్స్‌ పరిణామం నుంచి పుట్టుకొచ్చినవారే. కనీసం 150 రూపాయల టికెట్‌ ఉండే ఈ మల్టీఫ్లెక్స్‌లోకి సామాన్యాడే కాదు, మధ్యతరగతి కూడా వెళ్లే అవకాశం లేదు. స్పెషలైజేషన్‌ ఈ ఇరవై యేళ్లలో పెరిగిన మరో లక్షణం. విద్య, వైద్యరంగాల్లో ఇది తీవ్రంగా కనిపిస్తోంది. దానికదే మంచిచెడూ కాలేదు కానీ స్పెషలైజేషన్‌ ఇప్పటికైతే సామాన్యుడిని సేవలకు దూరంగా ఉంచేసింది. ఈ 20 యేళ్లలో పెరిగిన మరో ట్రెండ్‌ బ్రాండ్‌.  లో దుస్తులు కూడా బ్రాండెడ్‌ అవ్వాల్సిందే. ఏ తరగతికి అవసరమైన బ్రాండ్లు అన్ని విషయాల్లో స్థిరపడిపోయాయి. అంటే ఉన్నత తరగతి, ఉన్నత మధ్యతరగతి ఈ 20 యేళ్లలో అన్ని రంగాల్లో తనకు అవసరమైన వేదికలను సృష్టించుకోదగినంత ఎదిగింది అనేది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అది మనం సాధించిన అభివృద్ధి. అసలు అభివృద్ధే లేకుండా ఇదంతా సాధ్యం కాదు. కానీ ఇప్పటికీ ఎన్‌ఆర్‌ఇజిఎ లాంటి పథకాలు ప్రవేశపెట్టి ఓట్లు పొందాలని పాలకులు అనుకోవాల్సిన పరిస్థితి ఉండడం అభివృద్ధికున్న మరో పార్శ్వం.
          ఫ్యూడల్‌ వ్యవస్థ రూపం మార్చుకుని పెట్టుబడిదారీ సమాజంగా మారడం లాంటి పునాది పరిభాషను పక్కనబెట్టి పైపైన కనిపించే విషయాలకే పరిమితమైతే ఈ 20 యేళ్లలో భారత సంస్కృతీ సంప్రదాయాలమీద అత్యంత ప్రభావం చూపిన సాధనాలు-నాలుగు. ఒకటి టీవీ, రెండు ఇంటర్‌ నెట్‌,మూడు-మొబైల్‌. నాలుగు-ఐపిల్‌. 90కి ముందు టీవీ ఇంకా ఆరంభదశలోనే ఉన్న సాధనం. ఈ ఇరవై యేళ్లలో అది జనజీవితాన్ని దాదాపు శాసించే స్థాయికి ఎదిగింది. ఏది మంచో ఏది చెడో ఏది స్టెయిలో ఏది కాదో ఏది రుచికరమో ఏది కాదో ఏ ప్రదేశం చూడదగ్గదో ఏది కాదో అన్నీ టీవీనే చెప్పేస్తోంది. చివరకు పెళ్లాం మొగుళ్ల మధ్య గొడవలకు పంచాయితీలకు కూడా వేదికగా మారింది. రోటీ కపడా మకాన్‌ ఔర్‌ టీవీ అనే స్థితి. ఇక మిగిలిన మూడు ఈ 20 యేళ్లలోనే పుట్టి అంతలోనే విశ్వరూపం చూపించేశాయి. ఇంటర్‌నెట్‌ మనలోని అమాయకత్వాన్ని చంపేసింది. అవసరమైనవీ అవసరం లేనివీ కూడా బట్టబయలు చేసింది. మనలాంటి ముసుగు కప్పుకున్న సమాజాల్లో గుప్తమైన విషయాల మీద విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఇంటర్‌ నెట్‌ మన జీవితాల్లోకి రాకముందు ఉన్న జనరేషన్స్‌కు వచ్చిన తర్వాత జనరేషన్‌కు ఉన్న తేడా మామూలుది కాదు. పట్టణీకరణ వల్ల దానికి అనుబంధంగా ప్రైవేట్‌ విద్య, హాస్టల్స్‌, స్వేచ్ఛ, దానికితోడు ఇంటర్‌ నెట్‌ అన్నీ కాక్‌టెయిల్‌ మాదిరి యూత్‌ లైఫ్‌ని మార్చేశాయి. ఇంటర్‌నెట్‌ సమస్త సమాచారానికే కాకుండా జ్ఞానానికి అజ్ఞానానికి కూడా వేదికగా మారింది. మొబైల్‌, ఇంటర్‌నెట్టూ ముఖం తెలీకుండా సంభాషించుకునే స్నేహించుకునే ఏర్పాటు చేశాయి. ముఖం లేని చోట మనిషి స్వైరుడు అవుతాడు. అందులోనూ కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు మనలాంటి ముసుగు సమాజంలో స్వైరం ఎక్కువగా ఉంటుంది. 
            ఐటి, ఫార్మా, బయో వెల్లువలు ఉత్పత్తిలోకి మహిళా శక్తిని లాక్కొచ్చాయి. ఒకనాడు సాయంత్రం ఆరింటికల్లా అమ్మాయి ఇంట్లో లేకపోతే సైకిలేసుకుని వెతకడానికి బయల్దేరే తండ్రి ఇవాళ హాయిగా హైదరాబాద్‌ పంపించి మా అమ్మాయి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా చేస్తోంది అని చెప్పుకోగలుతున్నాడు. ఈ రెండు దశాబ్దాల్లో వచ్చిన మంచి మార్పు ఇది.  డిగ్రీ చదివి ఊర్లో వీధి అరుగుల మీద ప్రభుత్వం ఏం చేయట్లేదు. ఉద్యోగాలివ్వడం లేదు అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే ఆవారా యువబృందాలు ఇపుడు కనిపించడం లేదు. ప్రభుత్వమే ఏకైక దిక్కు అనే భావనను బద్దలు చేయడం వల్ల వచ్చిన పాజిటివ్‌ చేంజ్‌ ఇది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిరుద్యోగం ఇరవై యేళ్ల క్రితం ఉన్నట్టుగా ఇపుడు కనిపించడం లేదు. కాకపోతే పిల్లలను చిన్నప్పటినుంచే కెరీర్‌ ఓరియెంటేషన్‌తో పెంచడం వల్ల సమాజంతో తోటివారితో ఇంటరాక్షన్‌ కరువవడం వల్ల వారిలో కామన్‌ సెన్స్‌ లోపించి పెళుసుగా తయారవడం చూస్తున్నాం. చిన్నపాటి ఫెయిల్యూర్‌నే తట్టుకోలేక ఉసురు తీసుకోవడమో ఇంకొకరి ఉసురు తీయడమో చూస్తున్నాం. ఇదొక విషాద పార్శ్వం. ఐపిల్‌ మనుషుల్లో అణచివేసుకున్న కాంక్షను రోడ్డుమీదకు లాక్కొచ్చింది. ముఖ్యంగా పట్టణ సమాజంలో. చదువుల్లోకి ఉద్యోగాల్లోకి మహిళలు ఎక్కువగా రావడంతో బంధాలు పెరిగాయి. పట్టణ సమాజంలో ఉండే ప్రైవసీ అవకాశాలు స్వేచ్ఛా కాంక్షను పెంచాయి. గతంలో గర్భభయం సెక్స్‌ స్వేచ్ఛపై కొంతవరకు ఒక మూతను ఉంచేది. దాని భారం మహిళల్లోనే కనిపిస్తుంది కాబట్టి సమాజభయం ఎక్కువగా ఉండేది. ఇపుడు ఐపిల్‌తో ఆ భయం తొలగిపోయింది. దీని వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ బోలెడున్నాయని వైద్యులు మొత్తుకుంటున్నా రోజూ చాక్‌లెట్లలాగా చప్పరిస్తున్న వారు సైతం ఉన్నారు. బహుశా ఇలాంటి పరిణామాల్నే కొందరు పెద్దమనుషులు విలువల పతనంగా సమాజం చెడిపోవడంగా వర్ణిస్తూ ఉంటారు. విమెన్‌ ఉత్పత్తిలోకి రావడం అనే ఒక పెద్ద సానుకూల పరిణామం ముందు ఇలాంటివి చిన్నవిషయాలు. .  ఎమోషనల్‌ బాండేజ్‌కి ఫిజికల్‌ బాండేజ్‌కి ఉన్న తేడాను అర్థం చేసుకోలేకనో మానవసంబంధాలపై స్పష్టత లేకనో కొందరి జీవితాలు బుగ్గిపాలవుతున్న విషయం వాస్తవమే అయినా అది సంధిదశలో అనివార్యమైన విషాదంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువభాగం విషాదాలు మగవాళ్లు ఇంకా పాత మైండ్‌ సెట్‌ నుంచి రాకపోవడం వల్ల మేల్‌ పిగ్‌ ఇగో వల్ల జరుగుతున్నవి. అందుకోసం మొత్తం పరిణామాన్ని నిందించనక్కర్లేదు. 
             ఏమైతేనేం మన సమాజం చాలా గట్టిది. మన విలువలు గట్టివి. అనే పేరుతో సగభాగాన్ని తొక్కిఉంచిన పాతకాలపు ప్రేలాపనలను కొత్త ఆర్థిక సంబంధాలు బద్దలు చేశాయి.  మడీ మట్టు చాటున మగ్గబెడుతూ వచ్చిన సమాజంలోకి కొత్తగాలిని తీసుకొచ్చాయి. వాస్తవానికి గతంలో కూడా సమాజం ఎన్నడూ పూర్తిగా కరడు గట్టి లేదు. తప్పో ఒప్పో చేస్తే చేశావు గానీ బహిరంగంగా వ్యవస్థను ప్రశ్నించకు అనేది మన ముసుగు సమాజపు అలిఖిత చట్టం. గ్రామీణ జీవితంతో సంబంధమున్న వారందరికీ తెలిసిన విషయం ఇది. కాబట్టి అది ఇరవై యేళ్ల క్రిందటి గ్రామీణ సమాజమైనా ఇప్పటి పట్టణ సమాజమైనా తేడా వ్యక్తీకరణలోనే. అప్పట్లో ఏదైనా ముసుగు తప్పనిసరి. ఇవాల్టి పట్టణ సమాజం ముసుగు అంతగా అవసరం లేనిది. ఇన్‌ఫార్మల్‌గా ఉండే గ్రామీణ సమాజంలో మనిషిని గుర్తించేది కులంతో డబ్బుతోనే. పట్టణాల్లో చేసే పనిని బట్టే గుర్తింపు. పట్టణాల్లో అన్నీ ప్రదర్శన వస్తువులే. ఇల్లూ ఒళ్లూ అన్నీ. వేసుకునే చొక్కా, నడిపే వాహనం, ఉండే ఇళ్లు, తినే హోటల్‌, ఆరాధించే దేవత అన్నీ ప్రదర్శనకు పెట్టుకోవాల్సిందే. ఈ ఇరవై యేళ్లలో ఇది విపరీతంగా పెరిగింది. సమానత్వంలో సంతృప్తిని పొందే స్థితి సమాజంలో లేదు కాబట్టి ఆధిక్యంలో సంతృప్తిని పొందడానికి అందరూ ప్రయత్నిస్తారు. ఈ నిచ్చెనమెట్లు పాత గ్రామీణ సమాజంలో ఒక రకంగా ఉంటే పట్నాల్లో ఇంకో రకంగా ఉంటాయి. పల్లెల్లో ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేకుండానే ఆధిపత్యం చాటుకోవడానికి అవకాశం ఉంటుంది. పట్నాల్లో అది ప్రదర్శన ద్వారానే సాధ్యం. అందుకు మనిషి నిరంతరం పరుగు పెడుతూనే ఉంటాడు. ఇరవై యేళ్లలో ఈ పోటీ విపరీతంగా పెరిగింది. మనిషి స్థానాన్ని వినియోగదారుడు ఆక్రమించినట్టుగానే మనిషి కోసం మనిషి అనే ఆలోచనను పూర్తిగా పోగొట్టి మనిషి కి మనిషి పోటీ అనే వాతావరణాన్ని పెంచింది. చదువుల్లో కెరీర్లో స్పష్టంగా కనిపిస్తున్న ధోరణి ఇది. ఎక్కువ జీతం పొందడమే చదువు ఏకైక లక్ష్యంగా మారిపోవడం వల్ల మానవశాస్ర్తాలు అనాధల్లాగా మారిన విషాదాన్ని కూడా చూస్తున్నాం. ఈ ధోరణులపై అసంతృప్తితో వచ్చిన  దిల్‌ చాహ్ తా హై, త్రీ ఇడియట్స్‌, జిందగీ దుబారా నహీ మిలేగీ వంటి సినిమాలు సూపర్‌ హిట్‌ కావడం మన అంతరాల్లో ఉన్న కోరికలకు వాస్తవ స్థితికి మధ్య ఉన్న తేడాను చూపిస్తుందనుకోవచ్చు. బహుశా ఇది సంధి దశ. 
                                                                                                                                     -జి. ఎస్‌. రామ్మోహన్‌