Thursday 20 October 2011

రెండు దశాబ్దాలు-అనేక కుదుపులు


పివి నరసింహారావు సూత్రధారిగా మన్మోహన్‌ సింగ్‌ పాత్రధారిగా ఆరంభమైన కొత్త ఆర్థిక విధానాలకు ఇరవై యేళ్లు. చరిత్రాత్మకం అని చాలామంది చెప్పుకునే నాటి మన్మోహన్‌ బడ్జెట్‌కు 20 యేళ్లు. ఈ రెండు దశాబ్దాలు స్వతంత్రభారత చరిత్రలో ప్రత్యేకమైనవి. దేశపు దిశ దశ మార్చేసినవి. ఇది పారాడిమ్‌ చేంజ్‌  అనేది అందరూ ఒప్పుకునే మాటే. కాకపోతే గుణదోషాలకు సంబంధించి ఎవరి భాష్యం వారు చెప్పుకోవచ్చు. పెరిగిన పట్నాల గురించి తరిగిన పల్లెల గురించి, ఆదాయంతో పాటుగా పెరిగిన అంతరాల గురించి మాట్లాడుకోవచ్చు. అంత గంభీరమైన విషయాల జోలికి పోకుండా మనకు కొట్టొచ్చినట్టు కనిపించే చిన్నచిన్న విషయాల గురించి కూడా మాట్లాడుకోవచ్చు. ఈ 20 యేళ్లలో కొన్ని కొత్త పదాలుపుట్టుకొచ్చాయి. కొన్నిపదాలకు కొత్త అర్థాలు పుట్టుకొచ్చాయి. అసలు ఆ రోజు బడ్జెట్‌ వచ్చీ రావడమే సరళీకరణ అనే  పదాన్ని మోసుకొచ్చింది. మామూలుగా సరళీకరణ అంటే ఉండే అర్థం వేరు. కానీ ఏం జరిగింది? ప్రభుత్వ రంగంలోని సంస్థలను ప్రైవేట్‌ పరం చేసే ప్రక్రియగా మార్చేశారు. సరుకు ఏదైనా ఎలా ఉన్నా పాకేజింగ్‌‌ మాత్రం అందంగా ఉండాలి అనే భావనకు ఇది సంకేతం. సారం కంటే రూపం ప్రధానమైపోయిన దశకు సంకేతం. రేట్లు పెంచాం అనరు. హేతుబద్ధీకరించాం అంటారు. ఈ ఒరవడిని అన్ని రంగాలు అందిపుచ్చుకున్నాయి.  బ్రిటీషర్లు లిఫ్ట్‌ అంటే అమెరికన్లు ఎలివేటర్‌ అంటారు చూశారూ అలా మార్కెట్‌ పాత పదాలకు సొంత అర్థాల్ని ఇచ్చుకోవడమే కాకుండా ప్రత్యామ్నాయ పదాల్ని కూడా సృష్టించుకుంది. ఇరవై యేళ్లక్రితం ఆరోగ్యంగా ఉండాలి అనేవారు. ఇపుడు ఫిట్‌నెస్‌తో ఉండాలి అంటున్నారు. అప్పట్లో క్లబ్‌ సాంగ్స్‌ అనేవారు. క్లబ్‌ డాన్సర్లనేవారు. ఇపుడు ఐటెమ్‌ సాంగ్స్‌ ఐటెమ్‌ గర్ల్స్‌ అంటున్నారు. జ్వోతిలక్ష్మీ, జయమాలిని, అనూరాధల కంటే ఒక అంగుళం ఎక్కువే బొడ్డుకింద, మెడకింద దిగేయడానికి హీరోయిన్లబడే వారే సిద్ధమవడంతో క్లబ్‌డాన్సర్లనే జాతి అంతరించింది. ఇరవై యేళ్లక్రితం సీరియల్‌ రచయితల హవా నడిచేది. మేగజైన్లు బాగా నడిచేవి. 90ల్లో టీవీలు మన నట్టింట్లోకి వచ్చాక వాటి గ్లామర్‌ తగ్గింది. సీరియళ్ల రచయితల్లో చాలామంది రూట్‌ మార్చి వ్యక్తిత్వ వికాసకులు అయిపోయారు. టేబుళ్లమీద చేతి రుమాలు ఎలా మడిచి పెట్టుకోవాలి. సూప్‌ ఒళ్లో పడకుండా ఎలా తాగాలి, ఇంటర్యూలో ఎలా కూర్చోవాలి లాంటి ఎటికెట్ కూడా పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ అయిపోయింది. స్పోకెన్‌ ఇంగ్లీష్‌ పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ జంటపదాలయి పోయాయి. 
              క్షౌరశాలలు అప్పటికే సెలూన్‌లుగా మారుతున్నాయి. అవి ఆ తర్వాత బ్యూటీ పార్లర్స్‌గా బ్యూటీస్టుడియోలుగా స్పాలుగా మారిపోయాయి. దర్జీ షాపులు బొతిక్‌లుగా రూపాంతరం చెందాయి. అంతకు ముందు బిజినెస్‌ వార్తలు లోపలిపేజీల్లో కనిపించేవి. ఇపుడు అవి పతాకశీర్షికలుగా మారిపోయాయి. మీడియాలో లైఫ్‌ స్టెయిల్‌ జర్నలిజం అనే పదం వచ్చి చేరడమే కాదు, ప్రధానమైన విభాగంగా మారిపోయింది. బార్లు ఆమ్‌ఆద్మీకి మిగిలిపోయి పబ్బులు హైక్లాస్‌ సెంటర్లుగా రూపాంతరం చెందాయి. అంటే అప్పర్‌క్లాస్‌, హయ్యర్‌ మిడిల్‌క్లాస్‌ ఈజీగా గుర్తించేట్టుగా ఇవి మీవి అని వారికి సులభంగా చెప్పగలిగేలా అన్ని విభాగాలూ కొత్త పరిభాషను సృష్టించుకున్నాయి. ఇరవై యేళ్ల క్రితం ఇండస్ర్టియలిస్టులు రాజకీయ నాయకులకు నిధులిచ్చి తమ పనులు చక్కబెట్టుకునే వారుగా మాత్రమే ఉండేవారు. ఈ 20 యేళ్లలో వచ్చిన పరిణామాలు తెర వెనుక ఉన్న వాళ్లను తెరమీదకు తెచ్చాయి. రాజకీయం అతి పెద్ద వ్యాపారంగా మారింది. మధ్యతరగతి అవినీతికి అవకాశాలు తగ్గిపోయి ఎక్కువ సమానుల పాత్రను కోల్పోయారు. అవినీతి తప్పుడు పని అని ఇప్పుడే కనిపెట్టేశారు. అంతా ఇపుడు రూల్‌ ఆఫ్‌ లా గురించి వాదిస్తున్నారు.
          ఇవి కాకుండా ఈ 20 యేళ్లలో ప్రధానమైన పరిణామం ఎక్స్‌క్లూజివ్‌ విధానాలు. విద్య, వైద్యం, ఆధ్యాత్మికం, రిక్రిషియేషన్‌ అన్ని రంగాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఏ క్లాస్‌కు ఆ క్లాస్‌ స్కూల్స్‌, ఆస్పత్రులు, సినిమా హాళ్లు, దేవాలయాలు కూడా ఏర్పడ్డాయి. పూనకం అనారగికమైపోయి ధ్యాన మార్గంలో సూక్ష్మ శరీరంతో దేహం వీడి ఎక్కడికో వెళ్లి రావడం లాంటి మాటలు ఆధునికమైపోయాయి. మామూలు సినిమాహాళ్లలో అలగా జనంతో పాటు వెళ్లి చూసే బాధ తప్పించుకోవడానికి ఉన్నత తరగతి మల్లీఫ్లెక్స్‌లను సృష్టించుకుంది. మల్టీప్లెక్స్‌ థియేటర్ల రాకతో దానికి అవసరమైన న్యూ జనరేషన్‌ సినిమాలు దర్శకులు వచ్చి చేరారు. దానికి సెన్సిబిలిటీ అనే అందమైన పదాన్ని ఆపాదించేసుకున్నారు. శేఖర్‌ కమ్ములలు, దేవ్‌ కట్టాలు, జాగర్లమూడి క్రిష్‌లు ఈ మల్లీఫ్లెక్స్‌ పరిణామం నుంచి పుట్టుకొచ్చినవారే. కనీసం 150 రూపాయల టికెట్‌ ఉండే ఈ మల్టీఫ్లెక్స్‌లోకి సామాన్యాడే కాదు, మధ్యతరగతి కూడా వెళ్లే అవకాశం లేదు. స్పెషలైజేషన్‌ ఈ ఇరవై యేళ్లలో పెరిగిన మరో లక్షణం. విద్య, వైద్యరంగాల్లో ఇది తీవ్రంగా కనిపిస్తోంది. దానికదే మంచిచెడూ కాలేదు కానీ స్పెషలైజేషన్‌ ఇప్పటికైతే సామాన్యుడిని సేవలకు దూరంగా ఉంచేసింది. ఈ 20 యేళ్లలో పెరిగిన మరో ట్రెండ్‌ బ్రాండ్‌.  లో దుస్తులు కూడా బ్రాండెడ్‌ అవ్వాల్సిందే. ఏ తరగతికి అవసరమైన బ్రాండ్లు అన్ని విషయాల్లో స్థిరపడిపోయాయి. అంటే ఉన్నత తరగతి, ఉన్నత మధ్యతరగతి ఈ 20 యేళ్లలో అన్ని రంగాల్లో తనకు అవసరమైన వేదికలను సృష్టించుకోదగినంత ఎదిగింది అనేది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అది మనం సాధించిన అభివృద్ధి. అసలు అభివృద్ధే లేకుండా ఇదంతా సాధ్యం కాదు. కానీ ఇప్పటికీ ఎన్‌ఆర్‌ఇజిఎ లాంటి పథకాలు ప్రవేశపెట్టి ఓట్లు పొందాలని పాలకులు అనుకోవాల్సిన పరిస్థితి ఉండడం అభివృద్ధికున్న మరో పార్శ్వం.
          ఫ్యూడల్‌ వ్యవస్థ రూపం మార్చుకుని పెట్టుబడిదారీ సమాజంగా మారడం లాంటి పునాది పరిభాషను పక్కనబెట్టి పైపైన కనిపించే విషయాలకే పరిమితమైతే ఈ 20 యేళ్లలో భారత సంస్కృతీ సంప్రదాయాలమీద అత్యంత ప్రభావం చూపిన సాధనాలు-నాలుగు. ఒకటి టీవీ, రెండు ఇంటర్‌ నెట్‌,మూడు-మొబైల్‌. నాలుగు-ఐపిల్‌. 90కి ముందు టీవీ ఇంకా ఆరంభదశలోనే ఉన్న సాధనం. ఈ ఇరవై యేళ్లలో అది జనజీవితాన్ని దాదాపు శాసించే స్థాయికి ఎదిగింది. ఏది మంచో ఏది చెడో ఏది స్టెయిలో ఏది కాదో ఏది రుచికరమో ఏది కాదో ఏ ప్రదేశం చూడదగ్గదో ఏది కాదో అన్నీ టీవీనే చెప్పేస్తోంది. చివరకు పెళ్లాం మొగుళ్ల మధ్య గొడవలకు పంచాయితీలకు కూడా వేదికగా మారింది. రోటీ కపడా మకాన్‌ ఔర్‌ టీవీ అనే స్థితి. ఇక మిగిలిన మూడు ఈ 20 యేళ్లలోనే పుట్టి అంతలోనే విశ్వరూపం చూపించేశాయి. ఇంటర్‌నెట్‌ మనలోని అమాయకత్వాన్ని చంపేసింది. అవసరమైనవీ అవసరం లేనివీ కూడా బట్టబయలు చేసింది. మనలాంటి ముసుగు కప్పుకున్న సమాజాల్లో గుప్తమైన విషయాల మీద విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఇంటర్‌ నెట్‌ మన జీవితాల్లోకి రాకముందు ఉన్న జనరేషన్స్‌కు వచ్చిన తర్వాత జనరేషన్‌కు ఉన్న తేడా మామూలుది కాదు. పట్టణీకరణ వల్ల దానికి అనుబంధంగా ప్రైవేట్‌ విద్య, హాస్టల్స్‌, స్వేచ్ఛ, దానికితోడు ఇంటర్‌ నెట్‌ అన్నీ కాక్‌టెయిల్‌ మాదిరి యూత్‌ లైఫ్‌ని మార్చేశాయి. ఇంటర్‌నెట్‌ సమస్త సమాచారానికే కాకుండా జ్ఞానానికి అజ్ఞానానికి కూడా వేదికగా మారింది. మొబైల్‌, ఇంటర్‌నెట్టూ ముఖం తెలీకుండా సంభాషించుకునే స్నేహించుకునే ఏర్పాటు చేశాయి. ముఖం లేని చోట మనిషి స్వైరుడు అవుతాడు. అందులోనూ కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు మనలాంటి ముసుగు సమాజంలో స్వైరం ఎక్కువగా ఉంటుంది. 
            ఐటి, ఫార్మా, బయో వెల్లువలు ఉత్పత్తిలోకి మహిళా శక్తిని లాక్కొచ్చాయి. ఒకనాడు సాయంత్రం ఆరింటికల్లా అమ్మాయి ఇంట్లో లేకపోతే సైకిలేసుకుని వెతకడానికి బయల్దేరే తండ్రి ఇవాళ హాయిగా హైదరాబాద్‌ పంపించి మా అమ్మాయి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా చేస్తోంది అని చెప్పుకోగలుతున్నాడు. ఈ రెండు దశాబ్దాల్లో వచ్చిన మంచి మార్పు ఇది.  డిగ్రీ చదివి ఊర్లో వీధి అరుగుల మీద ప్రభుత్వం ఏం చేయట్లేదు. ఉద్యోగాలివ్వడం లేదు అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే ఆవారా యువబృందాలు ఇపుడు కనిపించడం లేదు. ప్రభుత్వమే ఏకైక దిక్కు అనే భావనను బద్దలు చేయడం వల్ల వచ్చిన పాజిటివ్‌ చేంజ్‌ ఇది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిరుద్యోగం ఇరవై యేళ్ల క్రితం ఉన్నట్టుగా ఇపుడు కనిపించడం లేదు. కాకపోతే పిల్లలను చిన్నప్పటినుంచే కెరీర్‌ ఓరియెంటేషన్‌తో పెంచడం వల్ల సమాజంతో తోటివారితో ఇంటరాక్షన్‌ కరువవడం వల్ల వారిలో కామన్‌ సెన్స్‌ లోపించి పెళుసుగా తయారవడం చూస్తున్నాం. చిన్నపాటి ఫెయిల్యూర్‌నే తట్టుకోలేక ఉసురు తీసుకోవడమో ఇంకొకరి ఉసురు తీయడమో చూస్తున్నాం. ఇదొక విషాద పార్శ్వం. ఐపిల్‌ మనుషుల్లో అణచివేసుకున్న కాంక్షను రోడ్డుమీదకు లాక్కొచ్చింది. ముఖ్యంగా పట్టణ సమాజంలో. చదువుల్లోకి ఉద్యోగాల్లోకి మహిళలు ఎక్కువగా రావడంతో బంధాలు పెరిగాయి. పట్టణ సమాజంలో ఉండే ప్రైవసీ అవకాశాలు స్వేచ్ఛా కాంక్షను పెంచాయి. గతంలో గర్భభయం సెక్స్‌ స్వేచ్ఛపై కొంతవరకు ఒక మూతను ఉంచేది. దాని భారం మహిళల్లోనే కనిపిస్తుంది కాబట్టి సమాజభయం ఎక్కువగా ఉండేది. ఇపుడు ఐపిల్‌తో ఆ భయం తొలగిపోయింది. దీని వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ బోలెడున్నాయని వైద్యులు మొత్తుకుంటున్నా రోజూ చాక్‌లెట్లలాగా చప్పరిస్తున్న వారు సైతం ఉన్నారు. బహుశా ఇలాంటి పరిణామాల్నే కొందరు పెద్దమనుషులు విలువల పతనంగా సమాజం చెడిపోవడంగా వర్ణిస్తూ ఉంటారు. విమెన్‌ ఉత్పత్తిలోకి రావడం అనే ఒక పెద్ద సానుకూల పరిణామం ముందు ఇలాంటివి చిన్నవిషయాలు. .  ఎమోషనల్‌ బాండేజ్‌కి ఫిజికల్‌ బాండేజ్‌కి ఉన్న తేడాను అర్థం చేసుకోలేకనో మానవసంబంధాలపై స్పష్టత లేకనో కొందరి జీవితాలు బుగ్గిపాలవుతున్న విషయం వాస్తవమే అయినా అది సంధిదశలో అనివార్యమైన విషాదంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువభాగం విషాదాలు మగవాళ్లు ఇంకా పాత మైండ్‌ సెట్‌ నుంచి రాకపోవడం వల్ల మేల్‌ పిగ్‌ ఇగో వల్ల జరుగుతున్నవి. అందుకోసం మొత్తం పరిణామాన్ని నిందించనక్కర్లేదు. 
             ఏమైతేనేం మన సమాజం చాలా గట్టిది. మన విలువలు గట్టివి. అనే పేరుతో సగభాగాన్ని తొక్కిఉంచిన పాతకాలపు ప్రేలాపనలను కొత్త ఆర్థిక సంబంధాలు బద్దలు చేశాయి.  మడీ మట్టు చాటున మగ్గబెడుతూ వచ్చిన సమాజంలోకి కొత్తగాలిని తీసుకొచ్చాయి. వాస్తవానికి గతంలో కూడా సమాజం ఎన్నడూ పూర్తిగా కరడు గట్టి లేదు. తప్పో ఒప్పో చేస్తే చేశావు గానీ బహిరంగంగా వ్యవస్థను ప్రశ్నించకు అనేది మన ముసుగు సమాజపు అలిఖిత చట్టం. గ్రామీణ జీవితంతో సంబంధమున్న వారందరికీ తెలిసిన విషయం ఇది. కాబట్టి అది ఇరవై యేళ్ల క్రిందటి గ్రామీణ సమాజమైనా ఇప్పటి పట్టణ సమాజమైనా తేడా వ్యక్తీకరణలోనే. అప్పట్లో ఏదైనా ముసుగు తప్పనిసరి. ఇవాల్టి పట్టణ సమాజం ముసుగు అంతగా అవసరం లేనిది. ఇన్‌ఫార్మల్‌గా ఉండే గ్రామీణ సమాజంలో మనిషిని గుర్తించేది కులంతో డబ్బుతోనే. పట్టణాల్లో చేసే పనిని బట్టే గుర్తింపు. పట్టణాల్లో అన్నీ ప్రదర్శన వస్తువులే. ఇల్లూ ఒళ్లూ అన్నీ. వేసుకునే చొక్కా, నడిపే వాహనం, ఉండే ఇళ్లు, తినే హోటల్‌, ఆరాధించే దేవత అన్నీ ప్రదర్శనకు పెట్టుకోవాల్సిందే. ఈ ఇరవై యేళ్లలో ఇది విపరీతంగా పెరిగింది. సమానత్వంలో సంతృప్తిని పొందే స్థితి సమాజంలో లేదు కాబట్టి ఆధిక్యంలో సంతృప్తిని పొందడానికి అందరూ ప్రయత్నిస్తారు. ఈ నిచ్చెనమెట్లు పాత గ్రామీణ సమాజంలో ఒక రకంగా ఉంటే పట్నాల్లో ఇంకో రకంగా ఉంటాయి. పల్లెల్లో ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేకుండానే ఆధిపత్యం చాటుకోవడానికి అవకాశం ఉంటుంది. పట్నాల్లో అది ప్రదర్శన ద్వారానే సాధ్యం. అందుకు మనిషి నిరంతరం పరుగు పెడుతూనే ఉంటాడు. ఇరవై యేళ్లలో ఈ పోటీ విపరీతంగా పెరిగింది. మనిషి స్థానాన్ని వినియోగదారుడు ఆక్రమించినట్టుగానే మనిషి కోసం మనిషి అనే ఆలోచనను పూర్తిగా పోగొట్టి మనిషి కి మనిషి పోటీ అనే వాతావరణాన్ని పెంచింది. చదువుల్లో కెరీర్లో స్పష్టంగా కనిపిస్తున్న ధోరణి ఇది. ఎక్కువ జీతం పొందడమే చదువు ఏకైక లక్ష్యంగా మారిపోవడం వల్ల మానవశాస్ర్తాలు అనాధల్లాగా మారిన విషాదాన్ని కూడా చూస్తున్నాం. ఈ ధోరణులపై అసంతృప్తితో వచ్చిన  దిల్‌ చాహ్ తా హై, త్రీ ఇడియట్స్‌, జిందగీ దుబారా నహీ మిలేగీ వంటి సినిమాలు సూపర్‌ హిట్‌ కావడం మన అంతరాల్లో ఉన్న కోరికలకు వాస్తవ స్థితికి మధ్య ఉన్న తేడాను చూపిస్తుందనుకోవచ్చు. బహుశా ఇది సంధి దశ. 
                                                                                                                                     -జి. ఎస్‌. రామ్మోహన్‌

No comments:

Post a Comment